లక్నో, డిసెంబర్ 14: పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నానని ఏకంగా ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కు ఫిర్యాదు చేశారు. ఎన్నిమార్లు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోవటం లేదని, శారీరక, మానసిక వేధింపులను ఇక ఎదుర్కోలేనని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతివ్వాలని ఉత్తరప్రదేశ్ బాందా జిల్లా సివిల్ జడ్జి అర్పితా సాహూ సీజేఐకి తాజాగా రెండు పేజీల లేఖ రాశారు. బారాబంకి సివిల్ కోర్టులో జిల్లా జడ్జి నుంచి తరుచూ అనుచిత డిమాండ్లు వచ్చేవని, రాత్రి సమయాల్లో కలవాలని ఒత్తిడి తీసుకొచ్చేవాడని లేఖలో ఆమె ఆరోపించారు.
ఈ వ్యవహారంపై అనేక మార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో, ఆత్మహత్యకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీజేఐ చంద్రచూడ్కు లేఖ రాశారు. ‘మహిళా జడ్జి ఇలాంటి పరిస్థితిలో ఉంటూ, ఇతరులకు ఎలా న్యాయం చేయగలదు? నేను చేసిన ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపకుండా వాటిని కొట్టిపారేస్తున్నారు. ఇక నాకు బతకాలని లేదు. ఇలాంటి జీవితాన్ని కొనసాగించలేను’ అంటూ అర్పితా సాహూ తన ఆవేదన వెళ్లగక్కారు.