న్యూఢిల్లీ: విష వాయువు ఐదుగురి ఉసురుతీసింది. ఒక కుటుంబంలోని మహిళతోపాటు నలుగురు పిల్లలు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. షహదారా పరిధిలోని సీమాపురి ప్రాంతంలో ఒక ఇంట్లో నివాసం ఉంటున్న 33 ఏండ్ల మహిళ, ఆమె నలుగురు పిల్లలు చనిపోయి ఉండటాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. పోలీసులకు దీనిపై సమాచారం ఇచ్చారు.
దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఎలాంటి అనుమానాస్పద ఛాయలు వారికి కనిపించలేదు. దీంతో చల్లి నుంచి రక్షణకు ఇంట్లో వెలిగించిన మంట వల్ల వెలువడిన విషవాయువులు పీల్చి చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, మహిళా, నలుగురి పిల్లల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు మీడియాకు తెలిపారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే వారి మరణానికి అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. మరోవైపు మహిళతోపాటు ఆమె నలుగురు పిల్లలు చనిపోయిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.