జాష్పూర్: ఇంట్లోంచి అడుగు బయటపెట్టడమే ఆ వృద్ధురాలి పాలిట శాపమైంది. గడప దాటగానే కండ్ల ముందు కొండంత గజరాజు కనిపించడంతో ఆమె నిశ్చేష్ఠురాలై నిలబడింది. దాంతో ఏనుగు వెంటనే ఆమెను తొండంతో పట్టుకుని రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం నేలకు కొట్టి కాళ్లతో తొక్కి చంపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం జాష్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇవాళ ఉదయం ఈ ఘోర ఘటన జరిగింది.
తక్పారా ఫారెస్ట్ రేంజ్లోని ఓ గ్రామానికి చెందిన ప్యారీ తోపో అనే వృద్ధురాలు సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటికి రాగానే ఎదురుగా భారీగా ఏనుగు కనిపించింది. దాంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఆమె తేరుకునే లోపే ఏనుగు ఘోరానికి పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
అధికారులు తక్షణ సాయం కింద వృద్ధురాలి కుటుంబానికి రూ.25 వేలు అందజేశారు. సంబంధిత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన తర్వాత మిగతా రూ.5.75 లక్షల నష్టపరిహారం కూడా అందజేస్తామని చెప్పారు. ఇటీవల 14 ఏనుగులున్న మంద దారితప్పి జనావాసాల్లోకి వచ్చిందని, ఈ విషయాన్ని అన్ని గ్రామాలకు తెలిపి అప్రమత్తం చేశామని అధికారులు వెల్లడించారు.
కాగా, ఇటీవల గ్రామాలపై ఏనుగుల దాడులు పెరిగిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు తమ గ్రామాల్లోకి చొరబడుతున్నాయన్నారు. ముఖ్యంగా సుర్గుజా, రాయ్గఢ్, కోర్బా, సూరజ్పూర్, గరియాబంద్, బలరాంపూర్ జిల్లాల్లో ఏనుగుల దాడులు జరుగుతున్నాయని తెలిపారు.