హర్దోయ్: ఉత్తరప్రదేశ్ పోలీసులు వికలాంగురాలైన ఓ మహిళపట్ల అమానవీయంగా వ్యవహరించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బాధితురాలి చేతులు పట్టుకుని ఓ బస్తాను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం పరిసరాల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వికలాంగురాలైన ఓ మహిళ తన భర్తతో ఉన్న వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. అయితే, పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
దాంతో బాధితురాలు గోడపై నుంచి దాటి కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన ఇద్దరు మహిళా పోలీసులు ఆమెను రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న మహిళా పోలీస్స్టేషన్ వరకు ఆమె చేతులు పట్టి ఈడ్చుకెళ్లారు. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ఆమె ఫిర్యాదు చేయకుండానే గోడ దూకి ఎస్పీ ఆఫీస్లోకి వెళ్లే ప్రయత్నం చేసిందని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.