చెన్నై: కొత్తగా పెళ్లైన మహిళ తన భర్తతో కలిసి కొండపై ఉన్న ఆలయాన్ని దర్శించింది. అక్కడి కోతులకు పండ్లు పెడుతుండగా అవి చుట్టుముట్టాయి. భయాందోళన చెందిన నవ వధువు అదుపుతప్పి కొండ పైనుంచి కింద పడి మరణించింది. (Woman Fall From Hilltop Temple) తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిట్టన్కులం ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల అనితకు గత నెలలో 29 ఏళ్ల సురేష్తో వివాహం జరిగింది. విదేశాల్లో పనిచేసే అతడు ఇటీవల తిరిగివచ్చాడు.
కాగా, అనిత తన భర్త సురేష్తో కలిసి కజుగుమలైలోని కలుగసలమూర్తి ఆలయాన్ని దర్శించింది. ప్రధాన ఆలయంలో పూజల తర్వాత ఆ దంపతులు కొండపై ఉన్న ఉచ్చిపిళ్ళైయార్ ఆలయానికి వెళ్లారు. అక్కడ కోతులకు పండ్లు తినిపిస్తుండగా అకస్మాత్తుగా పలు కోతులు వారిని చుట్టుముట్టాయి. భయాందోళన చెందిన అనిత అదుపుతప్పింది. కొండ పైనుంచి కింద పడి మరణించింది. ఇది చూసి భర్త సురేష్ షాకయ్యాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అనిత మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. అనిత కొండ పైనుంచి కిందపడి మరణించడానికి దారితీసిన పరిస్థితులతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.