ముంబై: చదువుకున్నంత మాత్రానా మహిళను ఉద్యోగం చేయాలని బలవంతం చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. గ్రాడ్యుయేట్ అయిన మహిళ బయటకు వెళ్లి పని చేయాలా లేక ఇంటి వద్దనే ఉండాలా అన్నది పూర్తిగా ఆమె ఛాయిస్ అని పేర్కొంది. ఒక కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక జంటకు 2010లో పెళ్లి అయ్యింది. 2013లో భర్త, అతడి కుటుంబంపై భార్య గృహహింస కేసు పెట్టింది. దీంతో కుమార్తెతో కలిసి విడిగా ఆమె నివసిస్తున్నది. గృహహింస కేసుపై విచారణ పెండింగ్లో ఉండటంతో భర్త నుంచి పోషణ ఖర్చులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీంతో భార్యకు రూ.5,000, కుమార్తె ఖర్చుల కోసం విడిగా రూ.7,000 చొప్పున నెలకు చెల్లించాలని భర్తను పూణే ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.
కాగా, ఆ మహిళ భర్త దీనిని బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు. భార్య వరుసగా వేస్తున్న కేసులను పోరాడే ఆర్థిక స్థోమత లేక ఆర్థిక వనరులు తన వద్ద లేవని పిటిషన్లో పేర్కొన్నాడు. ఉద్యోగం చేస్తున్న భార్య, ఎలాంటి ఆదాయ వనరు లేదని తప్పుగా చెబుతోందని ఆరోపించాడు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి భారతి డాంగ్రే విచారణ జరిపారు. గ్రాడ్యుయేట్ అయిన మహిళ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదని మనం అనలేమన్నారు. చదువుకున్న మహిళ ఉద్యోగం చేయాలా లేక ఇంటి వద్దనే ఉండాలా అన్నది ఆమె నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
‘ఒక స్త్రీ ఇంటికి ఆర్థిక సహకారం అందించాలనేది మన సమాజం ఇంకా అంగీకరించలేదు. చదువుకున్న మహిళ పని చేయాలా లేక వద్దా అనేది ఆమె ఎంపిక. ఈ కేసులోని ఒకరు (భార్య) గ్రాడ్యుయేట్ అయినందున ఆమె ఇంటి వద్దనే ఉండాలన్నది కాదు. ఈ రోజు నేను న్యాయమూర్తిని. ఒకవేళ రేపు నేను ఇంట్లోనే ఉండాలనుకోవచ్చు. న్యాయమూర్తి అర్హత ఉన్నందున నేను ఇంటికే పరిమితం కాకూడదని మీరు చెబుతారా?’ అని న్యాయమూర్తి భారతి డాంగ్రే ప్రశ్నించారు. కాగా, భర్త తరుఫు న్యాయవాది వాదనలపై స్పందించేందుకు భార్య తరుఫు న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది.