పాట్నా: పొలంలో పని చేస్తున్న మహిళను కొందరు వ్యక్తులు కొట్టి దారుణంగా హత్య చేశారు (Woman Beaten To Death) . ఆమె కనుగుడ్లు పెకిలించారు. నాలుక కోశారు. ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. పస్రాహ గ్రామానికి చెందిన చెందిన 45 ఏళ్ల సులేఖా దేవి శనివారం పొలంలో పని చేస్తున్నది. భూవివాదం నేపథ్యంలో కొందరు పురుషులు ఆమెపై దాడి చేశారు. దారుణంగా కొట్టి చంపారు. కత్తితో కనుగుడ్లు పెకిలించారు. నాలుక కోశారు. కత్తితో ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పొరుగున ఉండే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సులేఖా దేవి దారుణ హత్యను ఖండిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. అయితే 2014 ఏప్రిల్ 25న సులేఖా దేవి భర్త బబ్లూ సింగ్, మరిదిని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య కేసు నిందితులు గతేడాది బెయిల్పై విడుదలయ్యారు.