లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధిన కేసులో ముఖ్య సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడైన దిల్బాగ్ సింగ్పై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దిల్బాగ్ సింగ్ కారులో వెళ్తున్న సమయంలో బైకప్ వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. లఖింపూర్ నుంచి గోలాకు వెళ్తున్న సమయంలో రాత్రి 10 గంటల సమయంలో అలీగంజ్ సమీపంలో తన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.
దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దిల్బాగ్ సింగ్ తెలిపారు. కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో తనకు రక్షణగా ఉన్న పోలీస్ గార్డ్ సెలవులో ఉన్నాడని, దీన్ని అవకాశంగా తీసుకొని తన ఎస్యూవీ వాహనంపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారన్నారు. మొదట ఎస్యూవీ టైర్లలో ఒకదాన్ని పంక్ఛర్ చేశారని, ఆ తర్వాత వాహనంపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. కారు అద్దాలను తెరిచేందుకు ప్రయత్నించారని, కాల్పులు జరిపిన తర్వాత నిందితులు పారిపోయారని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారని, ఘటనా స్థలాన్ని సందర్శించారని తెలిపారు. తనపై దాడి విషయాన్ని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్కు తెలిపినట్లు చెప్పారు. దిల్బాగ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎస్యూవీని, సంఘటనా స్థలాన్ని సందర్శించేందుకు ఫోరెన్సిక్ బృందాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఎస్పీ అరుణ్కుమార్ సింగ్ పేర్కొన్నారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని, దిల్బాగ్కు రక్షణగా ఉన్న గార్డ్ సెలవులో ఉన్నట్లు తమకు తెలియని, విషయం తెలిస్తే మరో సెక్యూరిటీ గార్డ్ను పంపేవారమన్నారు.
ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరి హింసాత్మక సంఘటన జరిగిన విషయం తెలిసిందే. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సమయంలో నలుగురు రైతులు, జర్నలిస్ట్ సహా ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్కుమార్ మిశ్రా తనయుడు ఆశిష్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన తన కారుతో రైతులను తొక్కించుకుంటూ వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నది.