న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్చిన తీర్పుపైనా గౌరవం అంతకంటే లేదు. ఎన్నికల ప్రక్రియతో పనిలేదు. ఓట్లు ఎవరికి వేసినా.. ఎవరికి మెజార్టీ వచ్చినా వాళ్లు పూర్తికాలం అధికారంలో ఉంటారన్న గ్యారంటీ ఎంతమాత్రం లేదు. ఎన్నికలు ఎలా జరగనీ.. ఎవరు అధికారంలోకి రానీ.. పవర్ మాత్రం తమకే దక్కాలి. ఇందుకోసం దేనికైనా తెగబడాలి.. ఎంతకైనా దిగజారాలి. తమకు అధికారం దక్కేదాకా.. ఎవరినైనా ఎలాగైనా లొంగదీసుకోవాలి.
ఇదీ బీజేపీ నీతి.. కాదు కాదు.. కూటనీతి. ప్రాంతీయ అస్తిత్వాలను కాలరాసి.. విపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసి.. నియంతృత్వంగా వ్యవహరించడం స్వతంత్రభారత చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. 2014లో మోదీ అధికారంలోకి రావడమే తరువాయి.. రెబెల్స్ను తయారుచేయడం.. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను వినియోగించుకొని బెదిరించి లొంగదీసుకోవడం..
వారు కమలం పువ్వును చెవిలో పెట్టగానే దర్యాప్తులన్నీ సద్దుమణగడం.. ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వాలను కూలదోసి తాము సీఎం కుర్చీపై కబ్జా పెట్టడం మోదీ బీజేపీ సిద్ధాంతంగా మారిపోయింది. 2014 నుంచి ఆరు రాష్ర్టాల్లో మోదీ బీజేపీ.. తనకు మెజార్టీ లేకున్నా అధికారంలోకి రావడమే ఇందుకు ఉదాహరణ. తాజాగా మహరాష్ట్రలో జరుగుతున్నదీ అదే.
అరుణాచల్ ప్రదేశ్: ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ మొదట అడుగువేసింది అరుణాచల్ ప్రదేశ్లోనే.. 2014 లో అరుణాచల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 60 సీట్లకు 42 సీట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 11 సీట్లతో సరిపెట్టుకొన్నది. 2016 నాటికి సీన్ మారిపోయింది. ముందుగా నాబం టుకి ముఖ్యమంత్రి అయ్యారు. 2016 జూలైలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పెమాఖండు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలతో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ లో చేరి.. బీజేపీ లోపాయికారి మద్దతుతో అధికారంలో కొనసాగారు. ఏడాది తరువాత బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసేశారు. మనిషి నెత్తురు రుచి చూసిన పులి మాదిరిగా.. అరుణాచల్ సక్సెస్తో బీజేపీ రెచ్చిపోయింది.
కర్ణాటక: 2019 ఎన్నికల తరువాత కర్ణాటకలో జేడీ(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ముందుగా బీజేపీకి గవర్నర్ అవకాశమిచ్చారు. యెడ్యూరప్ప అధికారంలోకి వచ్చారు. కానీ మెజార్టీ లేకపోవడంతో విశ్వాసపరీక్షకు ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత కుమారస్వామి కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మోదీ బీజేపీకి ఈ పరిణామం మింగుడుపడలేదు.16 మంది ఎమ్మెల్యేలను లొంగదీసుకొని కుమారస్వామి సర్కారును పడగొట్టి మళ్లీ యెడ్యూరప్పను అధికారంలోకి తెచ్చింది.
మధ్యప్రదేశ్: బీజేపీ పాగా వేసిన మూడో రాష్ట్రం మధ్యప్రదేశ్. 2018 ఎన్నికల్లో 121 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కమల్నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. యువనాయకుడు జ్యోతిరాదిత్య సింధియాతోపాటు 26 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంతో కమల్నాథ్ సర్కారు కూలిపోయింది. సింధియా కేంద్ర మంత్రి అయిపోయారు.
మణిపూర్: 2017లో జరిగిన ఎన్నికల్లో మణిపూర్లో కాంగ్రెస్ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. 21 సీట్లే వచ్చిన బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకొన్న బీజేపీ దొడ్డిదారిన అధికారం చేపట్టింది.
గోవా: గోవాలోనూ ఇదే పరిస్థితి. 2017లో జరిగిన ఎన్నికల్లో.. 40 స్థానాలకు గానూ.. 17 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీకి నాలుగు సీట్ల దూరంలోనే ఉండిపోయింది. కేవలం 13 సీట్లు గెలుచుకొన్న బీజేపీ ముందుగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తనవైపు లాక్కున్నది. తరువాత పదిమందిని ఫిరాయించేలా చేసింది. కాంగ్రెస్ మేలుకొనకముందే బీజేపీ అధికారంలోకి వచ్చింది.
సిక్కిం: సిక్కింలో మరీ విచిత్రమైన పరిస్థితి. 2019 లో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. పైగా పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు పోగొట్టుకున్నది. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు (మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామింగ్ మినహా) అందరూ బీజేపీలో చేరిపోయారు.
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో అధికారంలో ఉండి కూడా ఎన్నికలకు రెండు నెలలకు ముందు అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్తోపాటు డీఎంకేకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకొన్నది.
రాజస్థాన్: రాజస్థాన్లో సైతం అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది సచిన్పైలట్ను తనవైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించినట్టే ఫలించి విఫలమైంది. దీంతో అక్కడ కాంగ్రెస్ ఊపిరి పీల్చుకొన్నది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ బీజేపీ అదే పాలిట్రిక్స్ చేస్తున్నది.