లక్నో: ఉత్తరప్రదేశ్లో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,787 కొత్త కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. రాజధాని లక్నోలో కూడా రికార్డు స్థాయిలో 4,059 కరోనా కేసులు, 23 మరణాలు వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్లో శుక్రవారం 9,695 కరోనా కేసులు నమోదు కాగా ఒక్క రోజులో మూడు వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 58,799కు పెరిగింది.
మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై శనివారం గొరఖ్పూర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు కోసం మరో రెండు రోజుల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. యూపీలో ఇప్పటికే నోయిడా, అలహాబాద్, మీరట్, బరేలి, ఘజియాబాద్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లను మూసివేశారు.