CM Pinarayi Vijayan | మలప్పురం, మార్చి 25: భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదటగా ఇచ్చారని, అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ్ పరివార్ వదిలేస్తుందా? అని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో, స్వాతంత్య్ర ఉద్యమంలో చాలా మంది ముస్లింలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని కూడా అజిముల్లా ఖాన్ అనే వ్యక్తి మొదట ఇచ్చాడని పేర్కొన్న ఆయన.. అసలు ఈ విషయం సంఘ్ పరివార్ నేతలకు తెలుసా? అని ప్రశ్నించారు. అబిద్ హసన్ అనే మాజీ దౌత్యవేత్త ‘జై హింద్’ అని మొదటగా నినదించారని విజయన్ పేర్కొన్నారు.
ముస్లిం పాలకుడు షాజహాన్ కుమారుడు దారా షికో 50కి పైగా ఉపనిషత్తులను సంస్కృతం నుంచి పర్షియన్ భాషలోకి అనువదింపజేశాడని, ఇది భారతీయ గ్రంథాలను ప్రపంచమంతా వ్యాప్తి చెందడంలో సాయపడిందని వివరించారు. ముస్లింలను మన దేశం నుంచి వెళ్లాగొట్టాలని వాదిస్తున్న సంఘ్ పరివార్ నేతలు, కార్యకర్తలు ఈ చారిత్రక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.