కాంగ్రెస్లో మళ్లీ ప్రియాంక గాంధీకి మద్దతు పెరిగింది. ఉదయ్ పూర్ వేదికగా జరిగిన చింతన్ శిబిర్లో ప్రియాంకకు అధ్యక్ష| పగ్గాలు అప్పజెప్పాలన్న డిమాండ్ ఒక్కసారిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్ వచ్చిన సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురూ అక్కడే వున్నారు. అయినా కిమ్మనలేదు.
తాజాగా.. కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎవరెవర్ని పంపాలన్న విషయంలో సోనియా గాంధీ వర్కవుట్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాగేల్ తెరపైకి ప్రియాంక పేరును తెచ్చారు. రాజ్యసభకు ప్రియాంక గాంధీని నామినేట్ చేయాలని తాజాగా డిమాండ్ చేస్తున్నారు.
జూన్ 10 న రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 57 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. యూపీ నుంచి ఎక్కువ మొత్తంలో 11 సీట్లు ఖాళీ అవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు నుంచి 6 సీట్లు, బిహార్ నుంచి 5 సీట్లు, ఆంధ్ర, కర్నాటక నుంచి నాలుగేసి సీట్లు, మధ్యప్రదేశ్, ఒరిస్సా నుంచి మూడేసి సీట్లు, పంజాబ్, చత్తీస్గఢ్, తెలంగాణ, హర్యానా, జార్ఖండ్ రెండేసి సీట్లు ఖాళీ అవుతున్నాయి.
ఇక..చత్తీస్గఢ్ నుంచి మొత్తం 5 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో 2 సీట్లు జూన్ మాసానికి ఖాళీ అవుతున్నాయి. ఛాయావర్మను చత్తీస్గఢ్ నుంచి మళ్లీ రాజ్యసభకు పంపనున్నారు. ఇక… రెండో సీటు నుంచి ప్రియాంకను రాజ్యసభకు పంపడానికి సీఎం బాఘేల్ తీవ్ర లాబీయింగ్ చేస్తున్నారు. తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రియాంక గనక తిరస్కరిస్తే… అజయ్ మాకెన్ను రాజ్యసభకు పంపనున్నారు.