Amit Shah | కోల్కతా: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా బెంగాల్లో మమతా బెనర్జీకి చోటు లేకుండా చేద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడితే బెంగాల్లో 2025లో అసెంబ్లీ ఎన్నికల అవసరమే ఉండదు. ఎన్నికల కన్నా ముందే మమత మూటాముల్లె సర్దుకుని నిష్క్రమిస్తారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీర్భూమ్లో శుక్రవారం జరిగిన సభలో షా మాట్లాడుతూ బెంగాల్లో హిట్లర్ తరహా పాలన కొనసాగుతున్నదని విమర్శించారు.
బెంగాల్లోని 42 లోక్సభ సీట్లలకు 35 స్థానాల్లో బీజేపీని గెలిపిస్తే ఇక ముందు ఎవరూ శ్రీరామనవమి ఉత్సవ ర్యాలీలపై దాడి చేసే ధైర్యం చేయరని ఇటీవల జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ అన్నారు. ‘నేనొకటి స్పష్టం చేయదల్చుకున్నా.. మళ్లీ దేశానికి మోదీ యే ప్రధాని అవుతారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి మా పార్టీకి 35 సీట్లు ఇవ్వండి. 2025 తర్వాత మమత ప్రభుత్వం బతికి బట్టకట్టలేదని కచ్చితంగా చెప్తున్నా’ అని షా వ్యాఖ్యానించారు.
తన మేనల్లుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని మమత కలలు కంటున్నారని ఆరోపించారు. కానీ టీఎంసీ అవినీతిపై పోరాడే పార్టీ బీజేపీ మాత్రమేనని, తమ అభ్యర్థే సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారని తెలిపారు. అమిత్ షా పర్యటన వేళ ఒక కారులో 3,400 డిటోనేటర్లు దొరకడం కలకలం రేపింది. మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలను అధికార టీఎంసీ తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని విమర్శించింది.