Nitish-BJP | బీహార్ సీఎం నితీశ్కుమార్కు, ఆయన మిత్రపక్షం బీజేపీకి మధ్య దూరం పెరిగిందా.. ఎన్డీయే నుంచి వైదొలిగేందుకు నితీశ్ కుమార్ మానసికంగా సిద్ధమయ్యారా?.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీహార్లో రాజకీయ కార్యకలాపాల వేడి పెరిగింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పార్టీల శాసనసభాపక్ష సమావేశాలు వచ్చే రెండు రోజుల్లో జరుగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీతోపాటు అధికార జేడీయూ, కాంగ్రెస్, జీతన్రామ్ మాంజీ సారధ్యంలోని హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్యూఎం) వేర్వేరుగా సమావేశం కానున్నాయి.
మరోవైపు బీజేపీపై జేడీయూ బీహార్ అధ్యక్షుడు ఉమేశ్ కుశ్వాహా నిప్పులు చెరిగారు. ప్రాంతీయ పార్టీలకు చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై విమర్శలు విమర్శలు గుప్పించారు. కేంద్ర పరిశ్రమల మంత్రి షానావాజ్ హుస్సేన్, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీజేపీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకే వారు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తున్నది.
కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్.. జేడీయూకు రాజీనామా చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ.. దీనిపై సమాధానం చెప్పాలని ఆర్సీపీ సింగ్కు జేడీయూ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుపై స్పందించని ఆర్సీపీ సింగ్.. పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్సింగ్కు, ఆర్సీపీ సింగ్కు మధ్య మాటల తూటాలు పేలాయి. 2020లో మాదిరిగా జేడీయూను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతున్నదని బీజేపీ పేరెత్తకుండానే లలన్సింగ్ విమర్శలు గుప్పించారు. ఆర్సీపీ సింగ్ భౌతికంగా జేడీయూలోనే ఉన్నా.. ఆయన మనస్సు ఎక్కడో ఉందన్నారు. మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నితీశ్కుమార్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
బీజేపీతో విభేదాలు తీవ్రమయ్యాయన్న వార్తల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్లో మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇరువురు నేతలు దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్నట్లు సమాచారం. కానీ సోనియాగాంధీతో నితీశ్ కుమార్ ఫోన్ సంప్రదింపులు జరుగలేదని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పోటీ చేసిన నితీశ్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై అవినీతి ఆరోపణల సాకుగా 2017లో ఆర్జేడీ-మహాఘట్బంధన్కు తిలోదకాలిచ్చారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
బీజేపీ నుంచి బయటకు వస్తే, నితీశ్ను అక్కున చేర్చుకునేందుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తెలిపింది. బీజేపీపై పోరాటానికి ఆర్జేడీ కట్టుబడి ఉందని, ఒకవేళ సీఎం సిద్ధపడితే, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ అన్నారు.
మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో మంగళవారం ఆర్జేడీ శాసనసభపక్ష సమావేశం జరుగనున్నది. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అధికార ప్రతినిధులను తొలగించేశారు. మీడియాకు ప్రకటనలు ఇచ్చేందుకు ఆర్జేడీ నిరాకరిస్తున్నది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ ఆర్జేడీ అని ఆ పార్టీ ఎంపీ మనోజ్కుమార్ ఝా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నెల 12 వరకు పాట్నా వీడొద్దని కోరింది.
ఎన్డీఏ:
బీజేపీ – 77
జేడీయూ-45
హమ్ –
స్వతంత్రులు-1
మొత్తం 127
మహా ఘట్బంధన్
ఆర్జేడీ -80
కాంగ్రెస్-19
సీపీఐ ఎంఎల్-12
సీపీఐ -2
సీపీఎం -2
ఏఐఎంఐఎం-1
మొత్తం _ 115