బెంగళూరు: మరో రెండేండ్లు కర్ణాటక సీఎంగా తానే ఉంటానని యడియూరప్ప తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకటన తనకు మరింత శక్తినిచ్చిందని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా కసరస్తు చేస్టున్నట్లుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఈమేరకు యడియూరప్ప స్పష్టం చేశారు. మిగతా రెండేండ్లు కూడా తానే సీఎంగా కొనసాగుతానని, ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని వెల్లడించారు.
కాగా, 78 ఏండ్ల యడియూరప్ప స్థానంలో సీఎంగా మరొకరు ఉండరని, ఆయనే కొనసాగుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తికాలం తానే సీఎంగా ఉంటానని యడియూరప్ప శుక్రవారం స్పష్టం చేశారు. మరోవైపు కరోనా నియంత్రణలో వైఫల్యం, అవినీతి నేపథ్యంలో సీఎంగా యడియూరప్పను తప్పించాలని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.