కేంద్రంలో మార్పు తథ్యం
రెండుమూడు నెలల్లో సంచలన వార్త
ప్రభుత్వాల ఏర్పాటు ప్రశ్నే కాదు..
మన పరిస్థితి ఏమిటన్నదే సవాలు
దేశం మార్పును కోరుకొంటున్నది
బెంగళూరు పర్యటనలో కేసీఆర్
దేవెగౌడ, కుమారస్వామితో భేటీ
ఇప్పటివరకు అనేక ప్రధానులు దేశాన్ని ఏలారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు దేశ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మన కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇవ్వాళ 16 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరింది. మనం ఇంకా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక స్థితికోసం కలలు కంటున్నాం. ఇది దేశానికి ఎంత అవమానం? చేయాలనే మనసు.. పట్టుదల ఉంటే అమెరికా కన్నా అద్భుతంగా పురోగమించే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): దేశంలో మార్పు రావడం తథ్యమని.. ఉజ్వల భారత నిర్మాణమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు. దేశంలో జరిగే మార్పును ఇక ఏ ఒక్కరూ ఆపలేరని స్పష్టంచేశారు. రెండుమూడు నెలల్లో దేశంలో సంచలన మార్పులు జరుగబోతున్నాయన్నారు. గురువారం బెంగళూరులో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమైన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తరు? ఎవరు ఏర్పాటు చెయ్యరు అనేది ప్రశ్నే కాదు.. దేశంలో ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అనేక ప్రధానులు దేశాన్ని ఏలారు. కానీ, జరిగిందేమిటి? ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు దేశ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మనకంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇవ్వాళ 16 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరింది. మనం ఇంకా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక స్థితికోసం కలలు కంటున్నాం. ఇది దేశానికి ఎంత అవమానం?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. చేయాలనే మనసు, పట్టుదల ఉంటే మనం అమెరికా కన్నా అద్భుతంగా పురోగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ‘ప్రపంచంలో ఎక్కడాలేని మానవ వనరులు, యువశక్తి ఉన్నదేశం మనది.
అద్భుతమైన వాతావరణం, నదుల్లో వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కానీ ఇవ్వాళ మన స్థితి ఏమిటి? ఎందుకీ దుస్థితి? స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయ్యాయని ఆజాదీకా అమృత మహోత్సవాలు జరుపుకొంటున్నాం. కానీ ఇంకా విద్యుత్తు కష్టాలను ఎదుర్కొంటున్నాం. తాగునీటి గోస తీరలేదు. సాగునీటి కష్టాలున్నాయి’ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? ఇంకెవరితో ఏర్పాటు చేయాలా? అన్నది ముఖ్యం కాదని, ఉజ్వల భారతాన్ని నిర్మిస్తామని మాత్రం కచ్చితంగా చెప్తామని కేసీఆర్ అన్నారు. ‘ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాల్లో జర్నలిస్టులు, మేధావులు, బుద్ధిజీవులు అంతా భాగస్వామ్యం కావాలి. మీడియా కూడా సంచలన వార్తలను విడిచిపెట్టాలి. జాతి నిర్మాణంలో అందరూ భాగస్వాములు కండి’ అని పిలుపునిచ్చారు. ‘ఇవ్వాళ దేశంలో ఎక్కడికివెళ్లినా రైతులు, దళితులు, ఆదివాసీ గిరిజనులు.. ఎవరూ సంతోషంగా లేరు’ అని చెప్పారు. ‘రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి. బాధ్యత లేనివాళ్లు ఎన్నైనా మాట్లాడతరు. ఉపన్యాసాలు చెప్పేందుకే ఉన్నామన్నట్టుగా ఉంటారు. కానీ వాస్తవాలు వేరు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూపాయి విలువ పతనమైంది. జీడీపీ దారుణంగా ఉన్నది. దేశ యువత, బుద్ధిజీవులు వీటిపై ఆలోచించాలి. దేశంలో గుణాత్మక మార్పులు రావాలి. అందుకోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. అందరూ ముందుకు రావాలి’ అని చెప్పారు.
మార్పును ఎవరూ ఆపలేరు
దేవెగౌడ, కుమారస్వామితో అనేక విషయాలపై చర్చించినట్టు కేసీఆర్ వెల్లడించారు. జాతీయ రాజకీయాలు.. కర్ణాటక రాజకీయాలు సహా అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ‘గతంలో కర్ణాటక ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు.. కర్ణాటకలో మార్పు తప్పకుండా వస్తుంది. రాష్ట్రంలో జేడీ (ఎస్) ప్రభుత్వం వస్తుంది. నేను మళ్లీ కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానని చెప్పిన. నేను చెప్పిందే నిజమైంది. ఈసారి కూడా పక్కాగా చెప్తున్నా.. దేశంలో జరిగే మార్పులను ఎవరూ ఆపలేరు’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. ‘మాటలు చెప్పే వాళ్లు మస్తు చెప్తరు. కానీ పక్కాగా చెప్తున్నా. భారత్ గుణాత్మక మార్పును కోరుకుంటున్నది. ఆ మార్పు తప్పదు. మార్చేద్దాం. దేశం పరివర్తన చెందాలి. ప్రజల్లో పరివర్తన తప్పకుండా వస్తుంది. దేశం.. రాజకీయ పార్టీలు.. నేతలు.. ఇజాలు.. ఇలా అనేక అంశాల్లో మార్పు జరుగబోతున్నది. జరిగి తీరుతుంది. రెండు మూడు నెలల్లో మీకు సెన్సేషనల్ న్యూస్ దొరుకుతాయి’ అని తెలిపారు.
మార్పు కోసం కేసీఆర్ ప్రయత్నాలు: కుమారస్వామి
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పేర్కొన్నారు. దేశంలో మార్పు జరగాలని, ప్రజల జీవితాల్లో గుణాత్మకంగా మార్పు చెందాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరు వచ్చారని ఆయన చెప్పారు.రెండు మూడు నెలల్లోనే తమ కార్యాచరణ వెల్లడిస్తామని కుమారస్వామి తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, జాజుల సురేందర్ బెంగళూరు వెళ్లారు.