Sanjay Raut : బీజేపీ నేతలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. ముంబైలోని ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు టిప్పుసుల్తాన్ పేరు పెట్టడాన్ని బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. ఓసారి కర్నాటక పర్యటనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వచ్చినప్పుడు టిప్పు సుల్తాన్ను మెచ్చుకున్నారని, ఆయన రాజీనామాను కూడా బీజేపీ డిమాండ్ చేస్తుందా? అంటూ సూటిగానే ప్రశ్నించారు. గతంలో రాంనాథ్ కూడా టిప్పు సుల్తాన్ను మెచ్చుకున్నారని, స్వాతంత్ర్య సమరయోధుడు అని పేర్కొన్నారని రౌత్ గుర్తు చేశారు.
‘చారిత్రక యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ టిప్పుసుల్తాన్ను మెచ్చుకున్నారు. కర్నాటక పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని కూడా రాజీనామా అడుగుతుందా బీజేపీ? ఈ విషయంలో బీజేపీ ఓ క్లారిటీ ఇవ్వాలి. ఇదంతా ఓ డ్రామా’ అంటూ సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు. తమకే చరిత్ర అంతా తెలుసన్న భ్రమల్లో బీజేపీ వుంటుందని, తామే చరిత్రకారులన్న భావన బీజేపీ నేతల్లో వుంటుందని ఎద్దేవా చేశారు. టిప్పు సుల్తాన్ గురించి తమకూ తెలుసని, బీజేపీ నుంచి చరిత్ర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని రౌత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని, కొత్త చరిత్రను రాయవద్దని చురకలంటించారు. ఢిల్లీలో కూర్చుని, చరిత్రను మార్చే ప్రయత్నాలు చేయవద్దని, అవి సక్సెస్ కూడా కావని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.