Supreme Court : భార్య ఇంటి పని, వంట పని చేయనంత మాత్రాన అది క్రూరత్వం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు ఒక మహిళను పెళ్లి చేసుకునేది పనులు చేయడం కోసం మాత్రమే కాదని అభిప్రాయపడింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించి, తాజా వ్యాఖ్యలు చేసింది. తన భార్య ఇంటి పనులు చేయడం లేదని, తనను, కుటుంబ సభ్యుల్ని చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని, ఈ నేపథ్యంలో ఆమె నుంచి విడాకులు కావాలని కోరుతూ ఒక వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
కేసు వివరాలకు సంబంధించి.. ఒక జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లైన వారం తర్వాత నుంచి భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని భర్త ఆరోపించాడు. తనను సరిగ్గా చూసుకోవడం లేదని, వంట చేయడం లేదని ఆరోపించాడు. అలాగే, తన తల్లిదండ్రుల్ని కూడా అసభ్య పదజాలంతో తిడుతోందన్నాడు. తనకు కొడుకు పుట్టినా, నామకరణానికి కూడా తనను, కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించలేదని కోర్టుకు తెలిపాడు. అందువల్ల ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. దీనిపై భార్య స్పందించింది. తను ప్రెగ్నెన్సీ సమయంలో భర్త, అత్తవారింటి అనుమతితోనే డెలివరీకి పుట్టింటికి వెళ్లానని, నామకరణానికి పిలిచినా వాళ్లు రాలేదని తెలిపింది. నగలు, డబ్బు కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది. ఇరువురి వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు మధ్యవర్తిత్వానికి ఆదేశించింది. ఇరువురికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
దీంతో భర్త విజ్ఞప్తి మేరకు ఇరువురికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కానీ, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల్ని సవాలు చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులపై స్టే విధించింది. దీంతో భర్త హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంలో వాదనలు జరిగాయి. తను పెళ్లి చేసుకుంది పని మనిషిని కాదని, జీవిత భాగస్వామిని అనే విషయం గుర్తు పెట్టుకోవాలని భర్తకు సూచించింది. భార్య ఇంటి పనులు చేయనంత మాత్రాన క్రూరత్వంగా భావించలేమని తెలిపింది. అంతేకాదు.. ఇది పాత కాలం కాదని, కొత్త తరం అని, అందువల్ల భర్తలు కూడా వంట చేయడం, బట్టలు ఉతకడంలో సాయపడాలని సూచించింది. తదుపరి విచారణ సందర్భంగా ఇరువురూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.