Supreme Court | మద్యం పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. అయితే, సబార్డినేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేజ్రీవాల్ తరఫున విచారణకు హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘మీరు ట్రయల్ కోర్టు ఎదుట బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేయలేదా? అని కేజ్రీవాల్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి ఆయన లేదని బదులిచ్చారు. ఎందుకు బెయిల్ దరఖాస్తు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టవిరుద్ధమని సింఘ్వీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేసింది. అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు ఏప్రిల్ 9న సమర్థించింది. ఇందులో చట్టవిరుద్ధం ఏమీ లేదని, పదేపదే సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాలేదని పేర్కొంది.