అహ్మదాబాద్, నవంబర్ 15: మోర్బీ తీగల వంతెన నిర్వహణ కాంట్రాక్టును టెండర్ లేకుండానే ఓరెవా కంపెనీకి ఎలా కట్టబెట్టారని గుజరాత్ సర్కారును ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ప్రమాద ఘటనపై విచారణను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం దానిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ప్రజలకు సంబంధించిన తీగల వంతెన అది. అలాంటి వంతెన నిర్వహణకు ఎందుకు టెండర్లు పిలువలేదు’ అని ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోశ్ శాస్త్రితో కూడిన ధర్మాసనం నిలదీసింది. ఓరెవా కంపెనీతో చేసుకొన్న అగ్రిమెంట్పైనా అసహనం వ్యక్తం చేసింది. కేవలం ఒకటిన్నర పేజీల ఒప్పందం ఏమిటి? అసలు ఎలాంటి నిబంధనలు లేవేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వంతెన ప్రారంభానికి ముందు దాని ఫిట్నెస్ను ధ్రువీకరించటానికి బాధ్యత వహించేది ఎవరు? అని వరుస ప్రశ్నలతో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కడిగేసింది. కాంట్రాక్టు ఫైల్స్ను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
ఒప్పందాలపై అనుమానాలు
తీగల వంతెన నిర్వహణ బాధ్యతల కోసం రాజ్కోట్ జిల్లా కలెక్టర్, ఓరెవా కంపెనీ మధ్య 2008లో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం 2017లోనే ముగిసినా మరో రెండేండ్ల పాటు ఆ కంపెనీనే నిర్వహణ చేపట్టింది. 2020లో కొత్తగా ఎంవోయూ చేసుకొన్నారు. అప్పుడు ఆ బ్రిడ్జి వినియోగానికి పనికొస్తుందా? లేదా? అని ఫిట్నెస్ టెస్ట్ చేయలేదు. దీంతో ఈ ఒప్పందాలపై కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. 2017 తర్వాత రెండేండ్ల పాటు ఎందుకు టెండర్ పిలవలేదు? 2020లో ఒప్పందం చేసుకొన్నా ఎందుకు ఫిట్నెస్ పరీక్ష చేయలేదు? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు 1963 గుజరాత్ మున్సిపాలిటీస్ చట్టం సెక్షన్ 65కి లోబడే జరిగాయా? అని అడిగారు.
మోర్బీ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?
కేసు విచారణకు మోర్బీ మున్సిపాలిటీ తరఫున ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. దీంతో నోటీసులు జారీ చేసినా హాజరుకాకపోవటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివి ప్రదర్శిస్తున్నారా? అని అధికారులపై తీవ్రంగా మండిపడింది. దీనిపై కారణాలను తెలియజేయాలని ఆదేశించింది. మోర్బీ మున్సిపాలిటీ తన బాధ్యతలు నిర్వర్తించటంలో విఫలమైందని, దాని ఫలితంగా 135 మంది ప్రాణాలు కోల్పోయారని కోర్టు అభిప్రాయపడింది. ఈ దుర్ఘటనకు బాధ్యులను చేస్తూ మున్సిపాలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. అంతర్గత విచారణైనా చేపట్టారా? అని ప్రశ్నించింది. అటు.. మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంపై తెలుసుకోవాలనుకొంటున్నామని చీఫ్ సెక్రటరీని న్యాయమూర్తులు అడిగారు. విచారణ బుధవారం కూడా కొనసాగనున్నది.