కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు ముకుల్ రాయ్ మండిపడ్డారు. తాను పార్టీ మారడంపై ఆయన కోర్టుకేగాక ఎక్కడికైనా వెళ్లవచ్చని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ ఆ పార్టీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన తిరిగి టీఎంసీ గూటికి చేరినా బీజేపీ శాసన సభ్యుడిగానే కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ముకుల్ రాయ్పై పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి బెంగాల్ అసెంబ్లీ స్పీకర్కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 30న దీనిపై తదుపరి విచారణ జరుపుతామని అప్పుడు రావాలని స్పీకర్ తమకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు ముకుల్ రాయ్పై పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తామని సువేందు అధికారి అన్నారు. దీంతో సువేందు ప్రకటనపై మండిపడిన ముకుల్ రాయ్, ఆయన కోర్టుకేగాక ఎక్కడికైనా వెళ్లవచ్చని వ్యాఖ్యానించారు.