భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో డ్రాగన్ ఓ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. హిందీ తెలిసిన గ్రాడ్యుయేట్లను సైన్యంలో ఎక్కువగా భర్తీ చేస్తోంది. సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? అన్న విషయాన్ని తొందరగా ఆరా తీయడానికి హిందీ తెలిసిన గ్రాడ్యుయేట్లను సైన్యంలో చేర్చుకుంటోంది.
ఇప్పటికే ఈ ప్రాసెస్ను చైనా సైన్యం ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దీనిని మరింత ఉధృతంగా చేయాలని తలపోస్తోందని కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సరిహద్దు భద్రతను చూస్తున్న మిలటరీ అధికారులు కొన్ని యూనివర్శిటీలను కూడా పర్యటించినట్లు తెలుస్తోంది.
చైనా సైన్యంలో హిందీ అనువాదకుడిగా చేరితే… అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్న భరోసాను చైనా ఆర్మీ అధికారులు విద్యార్థులకు వివరిస్తున్నారు. అలాగే వారిని సైన్యంలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలను కూడా ప్రారంభించారు.
కౌంటర్ ఇస్తున్న భారత ఆర్మీ
ఇక,… భారత్ కూడా ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తోంది. భారత సైనికులకు చైనా భాషను నేర్పించే పనిలో నిమగ్నమైపోయింది. ఈ దిశగా అడుగులు కూడా పడినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతంలో విధులు నిర్వర్తించే జవాన్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు.
ఐటీబీపీలో దాదాపు 90 వేల మంది సైనికులున్నారు. వీరందరికీ చైనా భాషను నేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఏదైనా ఘర్షణ తలెత్తితే, చైనా సైనికులతో నేరుగా చైనా మాట్లాడితే, వాతావరణంలో మార్పులుంటాయన్నది భారత వ్యూహం.