హైదరాబాద్, నవంబరు 24 (నమస్తే తెలంగాణ): పేదలను దోచడం.. కొందరు పెద్దలకు పంచిపెట్టడమే బీజేపీ చెప్తున్న గుజరాత్ మాడల్ అని ఆ రాష్ట్రంలోని సూరత్లోని మజూరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి పసుమర్తి వెంకట సత్యనారాయణ శర్మ(పీవీఎస్ శర్మ) అన్నారు. రకరకాల పేర్లతో పన్నులు వేసి.. కొందరికి లబ్ధి చేకూర్చడమే గుజరాత్లో జరిగిన అభివృద్ధి అని విమర్శించారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించారని.. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకొంటున్నారని తెలిపారు. ఈసారి గుజరాత్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన పీవీఎస్ శర్మ.. 1985లో గుజరాత్కు వెళ్లారు. ఆదాయపు పన్నుశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. కొంతకాలం ‘సత్యం టైమ్స్’ పేరుతో వార్తాపత్రికను కూడా నడిపించారు. సూరత్ నగర బీజేపీ అధ్యక్షుడిగా, స్థానిక కార్పొరేటర్గా, సూరత్ వాటర్బోర్డు చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. బీజేపీతో విభేదించి ఆప్లో చేరిన శర్మ ప్రస్తుతం మజూరా నుంచి ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీపై పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
ఇక్కడ కార్మిక చట్టాలు లేవు..
గుజరాత్ మాడల్ అంటే విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ దశాబ్దాల క్రితమే పారిశ్రామికీకరణ జరిగింది. చాలా పరిశ్రమలు ఉన్నాయి కానీ, వాటిలో పనిచేసే కార్మికులకు భద్రత లేదు. కనీస కార్మిక చట్టాల అమలు లేదు. కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. కంపెనీలు చెప్పినన్ని గంటలు పనిచేయాల్సిందే. పరిశ్రమలకు భూమి, కరెంటు, అనుమతులు వేగంగా, ఉచితంగా ఇస్తుంటారు. దీంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు దేశంలో దాదాపు అన్ని రాష్ర్టాలూ పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
గుజరాత్లో మాత్రం ప్రజలపై పన్నులు మోపి.. పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేస్తుంటారు. ఈ విధానం మంచిది కాదు. జీఎస్టీ కట్టేవారు 70% మంది ఉంటారు. ఇన్కంటాక్స్ కట్టేవారు 30% ఉంటారు. పన్నులు కట్టినవారి సొమ్మును పారిశ్రామికీకరణ పేరుతో పెట్టుబడిదారులకు ఇస్తుంటారు. గుజరాత్లో సామాన్యుల బతుకులు ఏమీ మారలేదు. బీజేపీ వ్యతిరేక విధానాలపై గొంతెత్తినవారిని నక్సలైట్ అంటారు.. ఉగ్రవాది అంటారు. సంఘవిద్రోహి అని ముద్ర వేస్తారు. నేను బీజేపీలో ఉన్నపుడే అప్పటి పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తీరుతో విభేదించా. అవినీతి, అక్రమాలు, విధానపరమైన నిర్ణయాల్లో డొల్లతనం గురించి నాటి సీఎం రూపానీకి కూడా చెప్పా.
పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కూడా కాంట్రాక్టే..
గుజరాత్లో వాస్తవ పరిస్థితుల గురించి బయటి రాష్ట్రాల వారికి పెద్దగా తెలియవు. ఇక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా నేరుగా రాదు. ఉద్యోగం పొందినవారు ఎవ్వరైనా తొలుత ఐదేండ్లు కాంట్రాక్టు ఉద్యోగులుగానే పనిచేయాల్సి ఉంటుంది. ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా.. కాంట్రాక్ట్ కిందే చేయాలి. అయిదేండ్లూ వీరికి ఫిక్స్డ్ పే ఇస్తారు. తర్వాత పర్మినెంట్ అవుతారు. పర్మినెంట్ చేయడం ఓ ప్రహసనం. నేను సూరత్లో చాలాకాలంగా ఉంటున్న. ఇక్కడ 25 లక్షల మందికిపైగా కార్మికులే ఉంటారు.
ఒకప్పుడు కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ వంటి ప్రాంతాల నుంచి కార్మికులు వలస వచ్చేవారు. ఇప్పుడు వలసలు ఆగిపోయాయి. సూరత్తో సహా చుట్టుపక్కల ఉన్నవారు తెలంగాణాకు వాపస్ వెళ్తున్నారు. నేను కూడా హైదరాబాద్కు వచ్చి వెళ్తుంట. మా బంధువులు అక్కడే ఉన్నారు. తెలంగాణలో అభివృద్ధి కనిపిస్తున్నది. వరంగల్ కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కు మొదలు పెట్టడం శుభ పరిణామమే. అక్కడ మార్కెటింగ్ వసతులు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది.