Gurugram : హరియాణాలోని గురుగ్రామ్ నగరం నీట మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం, బుధవారం కురిసిన వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రధాన రహదారులు మోకాలిలోతుపైగా నీళ్లతో నిండిపోయాయి. దీంతో వాహనాల కదలికలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి 3-4 గంటల సమయం పడుతోందని వాహనదారులు అంటున్నారు.
వర్షాలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు నీట మునగడం సహజమే అయినా.. అక్కడ నిత్యం రోడ్లు కుంగిపోతున్నాయి. తాజాగా గురుగ్రామ్లోని ఇఫ్కో చౌక్ వద్ద, జాతీయ రహదారిపై ఒక పెద్ద గొయ్యి ఏర్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. రోడ్డుపై ఇంత భారీ గుంత పడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవినీతికి పరాకాష్టగా నిలుస్తోందని స్థానిక ప్రజలు అంటున్నారు. అయితే, ఇది ఈ ఏడాది పరిస్థితే కాదు. గురుగ్రామ్లో ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటోందని స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు.
అయినా, అవినీతి కారణంగా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. మరోవైపు ఈ అంశంపై తాజాగా బీజేపీ ఎంపీ రావ్ ఇంద్రజీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నగరం ఇలా మునిగిపోవడానికి, ప్రజలు ఇబ్బందులు పడటానికి గతంలో కాంగ్రెస్ పాలనే కారణమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో చేసిన నాసిరకం పనుల వల్లే ఈ పరిస్థితి ఉందన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం.. ఆయన ఇక్కడి నుంచే 17 ఏళ్లుగా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పైగా 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో బీజేపీలోకి చేరి, ఆ పార్టీ నుంచి గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇంతకాలం ఎంపీగా పని చేసి, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా విమర్శలు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గురుగ్రామ్లో వర్షాల కారణంగా.. నీరు నిలిచిపోయింది. జనజీవనం, ట్రాఫిక్ స్తంభించింది. సాధారణ కార్యకలాపాలకు కూడా కష్టంగా మారింది.