ముంబై: హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? అని మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే తమకు, తమ కుటుంబాలకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే బాంబే హైకోర్టును ఆశ్రయించలేదని రెబల్ ఎమ్మెల్యేల తరుఫు న్యాయవాది నీరజ్ కా కౌల్ కోర్టుకు తెలిపారు. 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సోమవారం లోగా సమాధానం ఇవ్వాలన్న డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ నోటీసులు, డిప్యూటీ స్పీకర్ అధికారానికి సంబంధించి రెండు పిటిషన్లను రెబల్స్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. తమ బృందంలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు కోర్టుకు షిండే తెలిపారు. శివసేనలోని మొత్తం 55 మంది ఎమ్మెల్యేల మద్దతు రెబల్ గ్రూప్కే ఉందన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని పేర్కొన్నారు.
అలాగే తమకు అనర్హత నోటీసులు పంపిన డిప్యూటీ స్పీకర్ అధికారాన్ని షిండే వర్గం సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. ఆయన హోదానే అనుమానంగా ఉన్నప్పుడు అనర్హతపై వ్యవహరించే అధికారం డిప్యూటీ స్పీకర్కు లేదన్నారు. ‘అసెంబ్లీ సమావేశాలు జరగకపోయినా పర్వాలేదు. అసెంబ్లీ ఎప్పుడు సమావేశమైనా, డిప్యూటీ స్పీకర్ తొలగింపు తీర్మానం మొదటి అంశంగా ఉండాలి’ అని తిరుగుబాటు ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మరోవైపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారుల తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రెబల్స్ దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు చాలా బాగా విచారించగలదని తెలిపారు. ‘ఇది లీప్-ఫ్రాగింగ్ను అనుమతించే సందర్భం కాదు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదు’ అని అన్నారు.