BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయని పబ్లిక్ పాలసీ మేధోసంస్థ ఐడీఎఫ్సీ వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్లో తేలింది. అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలలు తేడాతో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61శాతానికి తగ్గిపోతాయని ఆ సర్వే పేర్కొంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏడాది ఎడంతో జరిగితే ప్రభావం మరింతగా తగ్గొచ్చని వెల్లడించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాల సరళిని విశ్లేషించి ఈ రిపోర్టును తయారుచేసింది.
జమిలి ఎన్నికల్లో జాతీయ అంశాల ఆధారంగా.. అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేసే అవకాశమున్నదని, దీంతో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదమున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకే జమిలి ఎన్నికలతో ఎక్కువ ప్రయోజనం జరుగొచ్చని, అందుకే, ఆ పార్టీ నేతలు జమిలి ఎన్నికల నిర్వహణకు పట్టుబడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.