రాయ్పూర్ : చత్తీస్ఘఢ్లో (Chhattisgarh Poll Results) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దిశగా బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ ఘనవిజయంతో ఛత్తీస్ఘఢ్ తదుపరి సీఎంగా బీజేపీ ఎవరివైపు మొగ్గుచూపుతుందనే ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో దాదాపు అర డజను మంది పోటీ పడుతున్నారు.
గిరిజన నేతను సీఎంగా ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తే గిరిజన నేత, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ చీఫ్ విష్ణుదేవ్ సాయి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఛత్తీస్ఘఢ్లో తదుపరి బీజేపీ సర్కార్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి రమణ్ సింగ్ సారధ్యంలో ఏర్పాటయ్యే అవకాశాలనూ విస్మరించలేం. ఇక మహిళా నేతను ఎంపిక చేయదలుచుకుంటే కేంద్ర గిరిజిన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ పేరు వినిపిస్తోంది.
రాజ్యసభ మాజీ ఎంపి రాంవిచార్ నేతం అత్యున్నత పదవి చేపట్టవచ్చని తెలుస్తోంది. ఇక ఓబీసీ నేతకు పట్టం కట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తే పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ అరుణ్ సావోకు టాప్ పోస్ట్ దక్కవచ్చని భావిస్తున్నారు. ఓబీసీ వర్గాల్లో అరుణ్ సావోకు గట్టి పట్టు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఓపీ చౌధరి డిప్యూటీ సీఎం రేసులో ముందున్నారు.
Read More :