షిమ్లా: లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడోసారి ప్రధాని పీఠం కోసం బీజేపీ, ఎలాగైనా పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హ్యాట్రిక్పై గురిపెట్టిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి మోదీయే తమ ప్రధాని అభ్యర్థి అని ప్రకటించిన ఎన్నికల గోదాలో దూసుకెళ్తున్నది. దానికి భిన్నంగా ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మాత్రం ప్రధాని అభ్యర్థి విషయంలో వెనుకబడి పోయింది. ఈసారి తాము అధికారంలోకి రావడం పక్కా అంటున్న విపక్ష కూటమి.. ప్రధాని ఎవరనే విషయం మాత్రం తేల్చడం లేదు. ఇదే విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjun Kharge) మీడియా ప్రశ్నించగా.. ఆయన ఏమన్నారంటే..
ఆఖరి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని ఏడు లోక్సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరుగనుంది. ఈనేపథ్యంలో మల్లికార్జున ఖర్గే షిమ్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా బ్లాక్ విజయం సాధిస్తే ప్రధాని ఎవరని మీడియా ప్రతినిథులు ఆయనను ప్రశ్నించారు. దీనికిగాను.. కౌన్ బనేగా కరోడ్పతి అని అడిగినట్లుందని చమత్కరించారు.
అయితే ఒకవేళ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినట్లతే కూటమిలోని నాయకులు ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పారు. కాగా, గతంలో ప్రధాని ఎవరని ముందుగా ప్రకటించకుండానే యూపీఏ అధికారంలో వచ్చింది. తమ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు పదేండ్ల పాటు దేశాన్ని పరిపాలించిందని చెప్పారు. 2004లో అంతా సోనియా గాంధీ ప్రధాని కావాలనుకున్నారు. కానీ ఆమె దానిని తిరస్కరించారని తెలిపారు. అప్పుడు తమకు 140 సీట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. కానీ 2009లో జరిగిన ఎన్నికల్లో 209 స్థానాలను గెలుపొందామని, మరోసారి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. అయినా కొన్నిసార్లు తెలివైన వ్యక్తులు కూడా చరిత్రను మరచిపోతారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.
2014, 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ పెద్దపెద్ద హామీలు గుప్పించారు. అయితే విజయం సాధించిన తర్వాత వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని చెప్పారని, అవన్నీ ఎక్కడపోయానని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను వదిలేసి విపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ప్రకృతి విపత్తులో విలవిలాడిని హిమాచల్ ప్రదేశ్ను ఆదుకోకపోగా, అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరించేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.