న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ప్రజలందరూ పాటిస్తే లాక్డౌన్ల అవసరం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) భారత్ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని..మాస్క్లు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం, వైరస్ చైన్ను తెంచేందుకు గుమికూడకుండా ఉండటం వంటి చర్యలను కొనసాగించాలని..వీటిని విధిగా పాటిస్తే లాక్డౌన్ల అవసరం ఉండదని డబ్ల్యూహెచ్ఓ భారత్ ప్రతినిధి రొడెరికో ఒఫ్రిన్ తేల్చిచెప్పారు.
కరోనా కట్టడికి మూకుమ్మడి నియంత్రణలు, ట్రావెల్ బ్యాన్ వంటి చర్యలు ఏమాత్రం పనికిరావని ఒఫ్రిన్ హెచ్చరించారు. కొవిడ్-19 కట్టడికి రిస్క్ ఆధారంగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రావెల్ బ్యాన్ విధించడం, ప్రజల రాకపోకలపై నియంత్రణలు విధించడం ఫలితాలు ఇవ్వదని పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్ఓ మూకుమ్మడి ట్రావెల్ బ్యాన్, ప్రజల కదలికలపై నియంత్రణలను సిఫార్సు చేయదని అన్నారు. మరోవైపు భారత్లో ఇప్పటివరకూ 8891 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూడగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.38 లక్షల కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ఒక్కరోజే 310 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.