Covid-19 Deaths | ప్రపంచ మానవాళిని వణికించిన కోవిడ్-19 మహమ్మారి వల్ల భారత్లో 43.02 మిలియన్ల మందికి పాజిటివ్ అని వచ్చిందని, 5,21,264 మంది మరణించారని కేంద్రం చెబుతున్నది. గత రెండేండ్లుగా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ క్రమంగా మారినా.. మరణాల్లో మాత్రం అమెరికా, బ్రెజిల్ కంటే వెనుకబడిందని గణాంకాల సారాంశం.
కానీ, సెకండ్ వేవ్లో దూసుకొచ్చిన డెల్టా వేరియంట్ వల్ల భారత్లో లెక్కకు రాని మరణాలు ఉన్నాయని అంచనా. భారత్లోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయని సాక్షాత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నివేదిక వెల్లడించబోతున్నదని సమాచారం. ప్రస్తుతం భారత్ చెబుతున్న మరణాల గణాంకాల కంటే వాస్తవంగా నాలుగు రెట్లు ఎక్కువ ఉండొచ్చునని డెవెక్స్ అనే డెవలప్మెంటల్ ప్లాట్ఫామ్ నిర్వహించిన అధ్యయన నివేదిక అంటున్నది. డెవెక్స్ నివేదిక ఈ వారంలో వెలుగు చూస్తుందని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు కూడా ప్రస్తుతం 61.48 లక్షలని గణాంకాలు చూపుతున్నా అంతకంటే డబుల్ మరణాలు సంభవించాయని డెవెక్స్ చెబుతున్నది. ఇప్పటికైతే అధికారికంగా పదిలక్షల మందికి పైగా మరణాలతో అమెరికా, 6.6 లక్షల మృతులతో బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 5.21 లక్షల మరణాలతో భారత్ మూడో స్థానంలో ఉంది. తాము కరోనా మృతులను పూర్తిగా లెక్కించలేదన్న అభియోగాలను భారత్ నిరాకరిస్తున్నది.