లక్నో: సెల్పీ తీసుకుంటుండగా ఒక యువకుడ్ని రైలు ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మరణించాడు (selfie death). ఉత్తరప్రదేశ్లోని మథురలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రెండు బైక్లపై వచ్చిన ముగ్గురు స్నేహితులు ద్వారకా ధీష్ ఆలయాన్ని దర్శించారు. ఆ తర్వాత తివారిపురం వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జీ వద్దకు వెళ్లారు. తమ మొబైల్ ఫోన్లతో సెల్ఫీలు తీసుకోసాగారు. ఇంతలో ఒక రైలు ఆ బ్రిడ్జీ మీదుగా వస్తున్నది. గమనించిన ముగ్గురు యువకులు బ్రిడ్జీ చివరకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
కాగా, ఇద్దరు యువకులు తప్పించుకోగా ఒకరిని రైలు ఢీకొట్టింది. దీంతో గాల్లో ఎగిరిపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడ్ని 18 ఏళ్ల వంశీగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రైలు పట్టాలు, రైల్వే బ్రిడ్జీలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని పోలీసులు సూచించారు.
మరోవైపు ఒక అధ్యయనం ప్రకారం, సెల్ఫీ మరణాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. సెల్ఫీలు తీసుకునే సందర్భాల్లో జరిగిన ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. 2011 నుంచి 2017 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 259 సెల్ఫీ మరణాలు నమోదయ్యాయి. వాటిలో 60 శాతానికి పైగా అంటే 159 సెల్ఫీ మరణాలు భారత్లో సంభవించాయి.