న్యూఢిల్లీ: దేశంలో గోధుమల ధరలు ఆకాశాన్నంటాయి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత గోధుమల ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. పండుగల కారణంగా గోధుమలకు డిమాండ్ పెరగడం, పరిమితంగా సరఫరాలు, అధిక దిగుమతి సుంకం గోధుమల ధరలు 8 నెలల గరిష్ఠ స్థాయికి పెరగడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో గోధుమల ధర 1.6 శాతం పెరిగింది. దాంతో ఒక మెట్రిక్ టన్ను గోధుమల రేటు ఢిల్లీలో రూ.27,390కి చేరుకుంది. గత ఎనిమిది నెలల్లో గోధుమలకు ఇంత ధర ఎన్నడూ లేదని రిటైల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పట్లో గోధుమల ధరలు తగ్గే సూచనలు లేవని కేంద్రం సంకేతాలిచ్చింది. గోధుమల దిగుమతిపై 40 శాతంగా ఉన్న సుంకాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించే ఆలోచనేదీ లేదని గత నెల వెల్లడించింది.