Whatsapp | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ భారతీయ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మెటా సారథ్యంలోని వాట్సాప్ గతేడాదిలో భారీ స్థాయిలో భారతీయ అకౌంట్లను నిషేధించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నియమాలను పాటించకపోవడంతో బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. దేశంలో 50కోట్ల మందికిపైగా వాట్సాప్ను వినియోగిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభా 108 కోట్లు. ఇందులో ప్రతి ఇద్దరిలో ఒకరు వాట్సాప్ను వినియోగిస్తున్నారు. ఇందులో చాలా మంది
దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీన్ని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా గతేడాది కాలంలో భారత్లో 2.38కోట్ల ఖాతాలను నిషేధించింది. 2021, జూలైలో గరిష్ఠంగా 30.27లక్షల ఖాతాలపై బ్యాన్ విధించింది.
అశ్లీల కంటెంట్, పరువు నష్టం కలిగించే, బెదిరింపులు, విద్వేషం, హింసను ప్రేరేపించే కంటెంట్ను షేర్ చేస్తున్నారని, వాటిని షేర్ చేస్తే చర్యలుంటాయని వాట్సాప్ హెచ్చరించింది. యూజర్లలో ఎవరి నుంచైనా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందితే.. ఆయా ఖాతాలను నిషేధించనున్నట్లు సైబర్ వ్యవహారాల నిపుణుడు, సైబ్రోటెక్ ప్రెసిడెంట్ అనూజ్ అగర్వాల్ పేర్కొన్నారు.
నేరస్తులతో సంబంధాలు, హత్యలు, లైంగిక దాడులు, అశ్లీల కంటెంట్ కోసం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన గణంకాల గురించి ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఓ సర్వే ప్రకారం.. పది మంది వాట్సాప్ యూజర్లలో నలుగురు అశ్లీల ఫొటోలు, వీడియోలను క్రమం తప్పకుండా యాక్సెస్ చేస్తున్నారు. అంటే దాదాపు 40శాతం మంది వాట్సాప్ వినియోగదారులు ప్రత్యక్షంగా పరోక్షంగా అశ్లీలం, హింసను ప్రేరేపించడం, పుకార్లను వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
మెటా నివేదిక ప్రకారం.. 2022 మొదటి త్రైమాసికంలో హింస, రెచ్చగొట్టే కంటెంట్కు సంబంధించిన 21.7 మిలియన్ పోస్ట్లపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంది. 1.8 బిలియన్ల నకిలీ సమాచారాన్ని తొలగించింది. ఇన్స్టాగ్రామ్ డ్రగ్స్ను ప్రమోట్ చేస్తున్న 1.8 మిలియన్ పోస్ట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది.