న్యూఢిల్లీ, నవంబర్ 7: మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకున్నా, ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా వాట్సాప్ను ఉపయోగించవచ్చు. అంతే కాకుండా ఒక వాట్సాప్ ఖాతాను ఫోన్, డెస్క్టాప్ ఈ రెండింట్లోనే కాకుండా మరో మూడు డివైజ్లలో వాడవచ్చు. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ‘మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్’తో వినియోగదారులకు ఈ వెసులుబాటు లభిస్తుంది. ఈ ఫీచర్ బీటా వర్షన్ను వాట్సాప్ కొద్ది రోజుల క్రితమే వినియోగదారులకు పరిచయం చేసింది. తాజాగా పూర్తిస్థాయిలో ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ప్రకటించింది. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్ వాట్సాప్కు కనెక్ట్ అయేందుకు ‘లింక్ ఎ డివైజ్’పై క్లిక్ చేయాలి. అప్పుడే ‘యూజ్ వాట్సాప్ ఇన్ అదర్ డివైజెస్’ అని పాప్ అప్ వస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా గరిష్ఠంగా మరో మూడు డివైజ్లలో వాట్సాప్ను ఉపయోగించవచ్చు.
14 రోజుల తర్వాత లాగ్ అవుట్
మల్టీడివైజ్ ఫీచర్తో వినియోగదారులు వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఒకేసారి నాలుగు డివైజ్లలో యాప్ను ఉపయోగించవచ్చు. ఒకవేళ వరుసగా 14 రోజుల పాటు ప్రైమరీ డివైజ్(వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్) మిగిలిన నాలుగు డివైజ్ల(కంపానియన్ డివైజ్లు)తో అనుసంధానం కాకపోతే వాటిలో నుంచి వాట్సాప్ ఆటోమేటిగ్గా లాగ్ అవుట్ అవుతుంది. అయితే ఖాతా ఉన్న ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా.. వాట్సాప్ లాగిన్ అయిన కంప్యూటర్, ట్యాబ్లెట్, పీసీ లేదా మొబైల్కు తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
ఒకసారి ఒకే డివైజ్లో
మల్టీ డివైజ్ ఫీచర్ ద్వారా లాగిన్ అయితే వాట్సాప్ ఖాతా ఒకసారి ఒకే డివైజ్లో పనిచేస్తుంది. అంటే యాప్ లేదా డెస్క్టాప్ డివైజ్ల నుంచి ఒకేసారి వేర్వేరు కాల్స్ చేయలేరు. భిన్నమైన డివైజ్ల నుంచి ఒకేసారి వేర్వేరు సందేశాలను వేర్వేరు వ్యక్తులకు పంపలేరు. లైవ్ లొకేషన్ చూడలేరు. ఈ ఫీచర్ ద్వారా కనెక్ట్ అయిన డివైజ్లకు కాల్స్ రావు. గ్రూప్లలో జాయినింగ్, గ్రూప్లను చూడటం లాంటివి చేయలేరు.