హైదరాబాద్: ఒకవేళ తాను దేశానికి ప్రధానమంత్రిని అయితే అప్పుడు ఉద్యోగ కల్పనపైనే ఎక్కువ దృష్టిపెట్టనున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ధి మంత్రం కన్నా.. ఉద్యోగాలు కల్పించడమే కీలకమన్నారు. అమెరికా మాజీ మంత్రి, హార్వర్డ్ స్కూల్ ప్రొఫెసర్ నికోలస్ బర్న్స్తో జరిగిన వర్చువల్ సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. ఆ చర్చలో మాట్లాడుతూ.. అభివృద్ధి మనకు చాలా అవసరమే కానీ, ఉత్పత్తిని పెంచడంతో పాటు తాము ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న మన అభివృద్ధి పథాన్ని పరిశీలిస్తే.. వృద్ధికి, ఉద్యోగ కల్పనకు సంబంధం లేకుండా ఉందన్నారు. ఉత్పత్తికి కూడా ఏ లింకు లేకుండాపోయిందన్నారు. చైనాలో ఉద్యోగ కల్పన లాంటి సమస్యలు లేవని, ఉద్యోగాలు ఇవ్వలేమని చైనా నేత ఎవరూ అనలేరని రాహుల్ తన చర్చలో పేర్కొన్నారు.
వృద్ధి రేటు 9 శాతం ఉండడం కాదు, దానికి తగినట్లు ఉద్యోగాల కల్పన కూడా జరగాలన్నారు. లేకుంటే ఆ వృద్ధి రేటు వృధా అన్నారు. భారతీయ వ్యవస్థీకృత సంస్థలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే మౌళిక వ్యవస్థలు ఉండాలని, న్యాయవ్యవస్థ నుంచి రక్షణ కావాలని, స్వేచ్ఛ మీడియా ఉండాలన్నారు. కానీ ఇలాంటివి ప్రస్తుతం లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు.. బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీలు కూడా ఎన్నికలు గెలవడం లేదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంస్థాగత నిర్మాణాలు అవసరమని అన్నారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో అందరూ విసుగెత్తిపోయినట్లు రాహుల్ ఆరోపించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ అన్ని భారతీయ సంస్థలను నాశనం చేశాయని, ఇప్పుడు ఇండియాలో ఆర్ఎస్ఎస్ ఒక్కటే ఉందని, అది అన్నింట్లోకి చొచ్చుకెళ్లిందన్నారు.