లక్నో: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో కొత్తగా చెక్కిన బాల రాముడి విగ్రహాన్ని సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రతిష్టించనున్నారు. అయితే ఇప్పటి వరకు పూజలందుకున్న రాముడి పాత విగ్రహాన్ని (old Ram Lalla) ఎక్కడ ఉంచుతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల బాల రాముడి విగ్రహంతో సహా నాలుగు రాముడి విగ్రహాలను రామ మందిరంలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాణప్రతిష్ట కోసం ఎంపిక చేసిన కొత్త విగ్రహానికి ముందు రాముడి పాత విగ్రహాం కూడా గర్భగుడిలో ఉంటుందని చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కోసం ఎంపిక చేయని మరో రెండు రాముడి విగ్రహాలను ఆలయం మొదటి, రెండో అంతస్తులో తర్వాత అధిష్టిస్తామని వెల్లడించారు.
కాగా, నిజమైన రాముడి విగ్రహం ఐదారు అంగులాల పొడవు ఉంటుందని రామ మందిరం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అది భక్తులకు కనిపించేలా కొత్తగా ప్రతిష్టించే 51 అంగులాల బాల రాముడి విగ్రహం ముందు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే గణేష్ భట్ చెక్కిన 51 అంగులాల బాలరాముడి విగ్రహంతో పాటు సత్య నారాయణ్ పాండే చెక్కిన పాలరాతి రాముడి విగ్రహాన్ని ఆలయం మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని వివరించారు.