బస్తీ: తెలిసిన వాళ్లే కదా అని ఇంట్లోకి రానిస్తే ఆ ఇంటిని నిండా ముంచేశారు. భర్తకు ఫూటుగా మద్యం తాగించి, భార్యపై అత్యాచారం చేశారు. అవమానం భరించలేక ఆ భర్త, భార్యలు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారు. వారి ముగ్గురు పిల్లలను అనాథలను చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బస్తీ జిల్లాలోని బాధితుల ఇంటికి శుక్రవారం రాత్రి వారికి తెలిసిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వస్తూనే మద్యం తీసుకొచ్చిన నిందితులు బాధితురాలి భర్తకు బాగా తాగించారు. అతను మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత ఇద్దరూ కలిసి అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే భర్తను చంపేస్తామని బెదిరించారు.
దాంతో భర్త మద్యం మత్తు నుంచి తేరుకున్న తర్వాత బాధితురాలు అతడికి విషయం చెప్పింది. ఆ తర్వాత అవమానం భరించలేక వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీడియోలో నిందితుల పేర్లను వెల్లడించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కాగా, ఆత్మహత్య చేసుకున్న దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో 8 ఏళ్ల, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులతోపాటు ఏడాది వయసున్న ఒక కుమార్తె ఉన్నది. తల్లిదండ్రి ఇద్దరూ మరణించడంతో ఇప్పుడు ఆ ముగ్గురూ అనాథలుగా మిగిలిపోయారు.