న్యూఢిల్లీ, జూన్ 1: చేతిలో రాజదండం, చుట్టూ మఠాధిపతులు, మత పెద్దలు, పూజారులు, బాజాభజంత్రీల నడుమ నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం జరిగిన తీరును సీపీఎం తీవ్రంగా ఖండించింది. భారత్ను ఓ హిందూత్వ దేశంగా, కొత్త ఇండియాగా చూపాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని, అందులో భాగంగానే రాజదండంతో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ క్రతువును ప్రధాని చేపట్టారని సీపీఎం అధికారిక పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’ సంపాదకీయం పేర్కొంది.
ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమమంతా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని ఆక్షేపించింది. ధర్మానికి ప్రతీక రాజదండమంటూ, కేంద్రం మరోవైపు మహిళా రెజ్లర్లపై పోలీసుల్ని ఉసిగొల్పిందని ‘పీపుల్స్ డెమొక్రసీ’ ఆగ్రహం వ్యక్తం చేసింది.