Assam-Meghalaya | అసోం, మేఘాలయ మధ్య ఉద్రిక్తతలు చల్లారలేదు. మేఘాలయకు పెట్రోల్ను సరఫరా చేయబోమని అసోం పెట్రోలియం మజ్దూర్ యూనియన్ ప్రకటించింది. దీంతో మేఘాలయలోని వాహనదారులంతా పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో సరిపడా ఫ్యూయల్ నింపుకోవడానికి పోటీ పడుతున్నారు. ఫలితంగా మేఘాలయలో పలు చోట్ల పెట్రోల్ బంకుల ముందు కి.మీ.ల పొడవునా వెహికల్స్ బారులు తీరాయి. దీంతో వాహనదారులను నియంత్రించలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
అసోం-మేఘాలయ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మేఘాలయ పౌరులు, అసోం ఫారెస్ట్ అధికారి మరణించారు. దీంతో మేఘాలయ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. తమ వారిని అక్రమంగా పొట్టన బెట్టుకున్నారంటే అసోం నుంచి వచ్చే ట్రక్కులు, లారీలపై మేఘాలయ వాసులు దాడులు చేశారు.
తమ వెహికల్స్కు ప్రమాదం పొంచి ఉందని అనుమానిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలకు అసోం పెట్రోల్ మజ్దూర్ యూనియన్ సమాచారం ఇచ్చింది. అసోం నుంచి మేఘాలయ వెళ్లే ట్యాంకర్లలో పెట్రోల్, డీజిల్ నింపొద్దని పేర్కొన్నట్లు లేఖలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేఘాలయ వాసులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు.