Rahul Gandhi | పంజాబ్లో ప్రధాని మోదీ భద్రతా విషయంలో తలెత్తిన లోపంపై రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే బీజేపీ, పంజాబ్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం సుప్రీం వద్దకు కూడా చేరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ఫైర్ అయ్యారు. ‘మన సరిహద్దుల్లో రోజూ జరిగే తంతు కూడా భద్రతకు పెద్ద లోపమే. దేశ భద్రతకు పెద్ద ముప్పే. మరి దీని గురించి మన ప్రధాని ఎప్పుడైనా మాట్లాడారా?’ అంటూ రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు.
సరిహద్దుల్లో చైనా చేస్తున్న అకృత్యాలపై కూడా రాహుల్ గతంలో అనేక మార్లు కేంద్రం పై విరుచుకుపడ్డారు. చైనాకు తగిన బుద్ధి చెప్పడానికి మోదీ సర్కార్ జంకుతోందని, చైనా భారత్ భూభాగం ఆక్రమించుకున్నా, మోదీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గతంలో ట్విట్టర్ వేదికగా చాలా సార్లు రాహుల్ విమర్శలకు దిగిన విషయం విదితమే. అదే విధంగా చైనా అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని గ్రామాల పేర్లను మార్చేసిందన్న వార్తలపై కూడా రాహుల్ స్పందించారు. 1971 లో సాధించిన విజయాన్ని కొన్ని రోజుల క్రిందటే మనం గుర్తు చేసుకున్నామని, దేశ భద్రత విషయంలో కఠిన నిర్ణయాలు అవసరమని, మాటలు ఏమాత్రం లాభం చేకూర్చవని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ విరుచుకుపడ్డారు.
మరోవైపు పంజాబ్లో ప్రధాని మోదీ భద్రతా విషయంలో తలెత్తిన లోపంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతూనే వుంది. తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ ఘాటుగా స్పందించారు. ప్రధాని భద్రతకు ముప్పు ఉందంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ, పంజాబ్ను బీజేపీ బద్నాం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని భద్రతలో ఎలాంటి లోపమూ తలెత్తలేదని ఆయన పునరుద్ఘాటించారు. మొదట హెలికాప్టర్ ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్న మోదీ, అకస్మాత్తుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నారని సూటిగా ప్రశ్నించారు.