Agnipath Protests | రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. భవిష్యత్తుకు భరోసా కల్పించని అగ్నిపథ్ స్కీమ్పై కన్నెర్రజేస్తూ.. దేశమంతా ఆర్మీ ఉద్యోగార్థులు ఆందోళన బాట పట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలతో రైళ్లను దగ్ధం చేశారు. రోడ్లను దిగ్భందించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగార్థులతో పాటు, మాజీ, ప్రస్తుత సైనికాధికారులు కూడా ఈ స్కీమ్పై అభ్యంతరం లేవనెత్తుతున్నారు.
వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ త్రివిధ దళాల్లో నియామకాలకు అగ్నిపథ్ పేరిట కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. నాలుగేండ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు 17.5-21 ఏండ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ పూర్తయ్యాక తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన అగ్నివీరుల్లో 25 శాతం మందినే శాశ్వత కమిషన్లో పని చేసేందుకు అవకాశం కల్పిస్తారు. మిగిలిన వారు వెనుదిరగాలి.