న్యూఢిల్లీ: లాంచ్ వెహికిల్ మార్క్ (LVM)-3 రాకెట్ ద్వారా ఈ ఏడాది జూలై 14 నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మిషన్.. 40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగింది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగినప్పటి నుంచి ఈ మూన్ మిషన్ చంద్రుడిపై పరిశోధనలు మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్-3 మిషన్ ఏమేం చేసింది అనే వివరాలను ఇస్రో వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఆగస్టు 23న తాజా మూన్ మిషన్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని గంటలకే విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటికి వచ్చింది. ఆ వెంటనే పని ప్రారంభించింది.
ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ బయటికి వచ్చి పని చేయడం, చంద్రుడి ఉపరితల పరిశోధన అనే మూడు ప్రధాన లక్ష్యాల్లో.. ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతా మార్పుల వివరాలను మూన్ మిషన్ ఇస్రోకు చేరవేసింది. ఆగస్టు 28న తన దారికి 4 మీటర్ల లోతు గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్ను అనుసరిస్తూ ప్రగ్యాన్ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది.