Rahul Gandhi | న్యూఢిల్లీ, ఆగస్టు 9: అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా బుధవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టాయి. ఓవైపు మణిపూర్ హింసతో తగలబడిపోతుంటే ప్రధాని మోదీ మౌనవ్రతం పాటిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అసమర్థంగా చేష్టలుడిగి చూస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ తన రాజకీయాలతో మణిపూర్లో భరతమాతను హత్య చేసిందని విమర్శించారు. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటించకపోవడాన్ని ప్రశ్నించారు. మణిపూర్ను దేశంలో ఒక భాగంగా ప్రధాని చూడడం లేదని అన్నారు. మణిపూర్ను రెండు భాగాలుగా చేశారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఎంపీలందరినీ దేశ ద్రోహులుగా అభివర్ణించారు. ‘భారత్ ప్రజల గొంతుక. మణిపూర్లో ఆ గొంతుకను మీరు(బీజేపీ) చంపేశారు. అంటే దీనర్థం మణిపూర్లో భరతమాతను హత్య చేశారు. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా మీరు భారత్ను కూడా చంపేశారు. మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులు’ అని రాహుల్ అన్నారు. ఆర్మీని మోహరించి మణిపూర్లో సాధారణ శాంతి పరిస్థితిని పునరుద్ధరించవచ్చని, అయితే కేంద్రం ఆ పనిచేయడం లేదని విమర్శించారు. ‘మీరు ప్రతి చోటా కిరోసిన్ చల్లుతున్నారు. మణిపూర్లో కిరోసిన్ చల్లి, దానికి మంట పెట్టారు. ఇప్పుడు హర్యానాలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రతిచోటా దేశంలో మంట పెట్టాలని చూస్తున్నారు. దేశమంతా భరతమాతను చంపేస్తున్నారు’ అని మండిపడ్డారు.
ఇదే సమయంలో ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని రావణుడితో పోలుస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. మేఘనాథుడు, కుంభకర్ణుడు సూచనలు మాత్రమే రావణుడు తీసుకొనేవాడని, అదేవిధంగా ఇప్పుడు మోదీ కూడా అమిత్షా, అదానీల మాటలే వింటున్నారని పేర్కొన్నారు.
మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించకుండా కేంద్రం మౌన ప్రేక్షకుడి పాత్ర పోషిస్తున్నదని విపక్ష ఎంపీలు ధ్వజమెత్తారు. మణిపూర్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ విమర్శించారు.
చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా మాట్లాడారు. విపక్షాలు రాజకీయాలు చేయొద్దని అన్నారు. సమస్య పరిష్కారంలో కేంద్రానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 152 మంది మరణించారని, 1,106 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, 14,898 మందిని అరెస్టు చేశామని తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు మాట్లాడిన అమిత్షా.. మణిపూర్ సీఎం బీరేన్ను మార్చబోమన్నారు. మే 4న మహిళల నగ్న ఊరేగింపు ఘటనకు సంబంధించిన వీడియో వ్యవహారం ప్రభుత్వానికి తెలియదన్నారు. మణిపూర్ శాంతి పునరుద్ధరణకు పిలుపునిస్తూ లోక్సభ ఓ తీర్మానం ఆమోదించింది.