Manipur Violence | న్యూఢిల్లీ, జూలై 31: మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ ఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది. మణిపూర్లో గత మూడు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండ, మహిళలపై దారుణాల పట్ల కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల తీరును ఏకిపారేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మణిపూర్ పోలీసుల నిర్లక్ష్యంపై ప్రశ్నల వర్షం కురిపించింది. మణిపూర్లో జరిగిన ఘటన భయంకరమైనదని వ్యాఖ్యానించింది. మణిపూర్ హింసాకాండ, మహిళలపై జరిగిన దారుణాలపై దాఖలైన పిటిషన్లు, బాధిత మహిళల పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. రాష్ట్రంలో నమోదైన కేసులకు సంబంధించి ఇప్పటివరకు తీసుకొన్న చర్యలపై సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. బాధిత మహిళలను అల్లరి మూకలకు అప్పగించిన పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేయడాన్ని తాము కోరుకోవడం లేదని, కేసుల విచారణను పర్యవేక్షించేందుకు మాజీ జడ్జీలతో కూడిన సిట్ లేదా కమిటీని ఏర్పాటు చేయాలనుకొంటున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
పోలీసులు ఏం చేస్తున్నారు?
మే 4న మహిళల వివస్త్ర ఘటన జరిగితే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్(మే 18) చేసేందుకు 14 రోజుల సమయం ఎందుకు తీసుకొన్నారని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. ‘దాదాపు నెల తర్వాత వీడియో ఘటన ఎఫ్ఐఆర్ను మేజిస్ట్రేట్ కోర్టుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు?’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. మహిళల వివస్త్ర ఘటన భయంకరమైనదని, పోలీసులే బాధిత మహిళలను నిందితులకు అప్పగించారని పలు మీడియా రిపోర్టులు చెబుతున్నాయని ప్రస్తావించింది. అందుకే తాము ఈ కేసు దర్యాప్తును పోలీసులు చేపట్టడాన్ని కోరుకోవడం లేదని, దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా? అనేదే తమ ఆందోళన అని పేర్కొన్నది. రాష్ట్రంలో హింసాకాండ బాధితులకు అందిస్తున్న పునరావాస ప్యాకేజీ వివరాలను కూడా తెలుసుకోవాలని అనుకొంటున్నామని తెలిపింది. ఇప్పటికే ఆలస్యమైందని, సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే న్యాయం జరుగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. మణిపూర్లో ఇంతకుముందెన్నడూ లేని రీతిలో హింసాకాండ చోటుచేసుకున్నదని కోర్టు అభిప్రాయపడింది. ‘ఇది నిర్భయ వంటి ఒక కేసు మాత్రమే కాదని, ప్రత్యేక ఘటన’ అని పేర్కొన్నది. మీడియాలో పలు విషయాలు వస్తున్నప్పటికీ, మణిపూర్ ప్రభుత్వం ఇప్పటికీ ఆధారాలు, వాస్తవాలు సేకరించలేకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని వ్యాఖ్యానించింది. మణిపూర్ హింస కేసులపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంటే, కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం లేదని అంతకుముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఎవర్నీ రక్షించొద్దని చెబుతున్నారా?
మణిపూర్తో పాటు ప్రతిపక్ష పాలిత పశ్చిమబెంగాల్, రాజస్థాన్, చత్తీస్గఢ్ వంటి రాష్ర్టాల్లోనూ మహిళలపై హింస జరుగుతున్నదని, దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాది, బీజేపీ నేత బాన్సూరీ స్వరాజ్ చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘వేరు వేరు ప్రాంతాల్లో ఇలా జరిగింది అలా జరిగింది.., దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలపై నేరాలు జరుగుతున్నాయి’ అని చెప్పడం ద్వారా మణిపూర్ ఘటనను సమర్థించుకోలేరని, దాని వల్ల ఎటువంటి లాభం లేదని స్పష్టం చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నేరాలు జరుగుతున్నాయని చెప్పడం ద్వారా ‘ రక్షిస్తే.. దేశంలోని మొత్తం ఆడబిడ్డలందరినీ రక్షించండి లేదా ఎవరినీ రక్షించొద్దని మీరు చెబుతున్నారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వద్ద డాటా లేదు..
మణిపూర్లో మహిళలపై జరిగిన దారుణాల కేసుల డాటా ప్రభుత్వం వద్ద లేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నదని నగ్న ఊరేగింపు బాధిత మహిళల తరపున కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. హింసకు పాల్పడిన వారికి పోలీసులు సహకరిస్తున్నారని, వివస్త్ర ఘటనపై సీబీఐ కాకుండా ఇతర స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరుగాలని బాధితులు కోరుకుంటున్నట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సకాలంలో విచారణ పూర్తయ్యేందుకు కేసును మణిపూర్యేతర రాష్ర్టానికి బదిలీ చేయాలని కేంద్ర హోం శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కోరింది.
ఈ సమాచారంతో రండి..
మణిపూర్లో హింస ప్రారంభమైన నాటి నుంచి నమోదైన దాదాపు 6 వేల ఎఫ్ఐఆర్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించినవి ఎన్ని? అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. అటువంటి కేసుల విభజన ఏమీ చేయలేదని కేంద్రం సమాధానంగా పేర్కొన్నది. దీంతో కింద పేర్కొన్న ఆరు పాయింట్లపై సమాచారంతో రేపు(మంగళవారం) కోర్టుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
మొత్తం నమోదైన ఎఫ్ఐఆర్లలో కేసుల విభజన
దేశంలోని అన్ని
ప్రాంతాల్లో మహిళలపై నేరాలు జరుగుతున్నాయి అని చెప్పడం ద్వారా మణిపూర్ ఘటనను సమర్థించుకోలేరు. రక్షిస్తే.. దేశంలోని మొత్తం ఆడబిడ్డలందరినీ రక్షించండి లేదా ఎవరినీ రక్షించొద్దని మీరు చెబుతున్నారా?.
-సీజేఐ జస్టిస్ చంద్రచూడ్