బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం(Odisha Train Accident)లో 275 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఉన్న ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి క్రిటికల్గా ఉంది. 36 ఏళ్ల అసిస్టెంట్ లోకో పైలెట్ హజారి బెహిరా ప్రస్తుతం భువనేశ్వర్లో ఉన్న ఏఎంఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. రైళ్లు ఢీకొన్న ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ అతను.. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
అయితే ఆ డ్రైవర్ ఫ్యామిలీ మాత్రం ప్రస్తుతం ఆందోళన చెందుతున్నది. తన భర్త చాలా బలహీనంగా ఉన్నాడని, సరిగా కూర్చోలేకపోతున్నట్లు బెహిరా భార్య ఓ మీడియాతో తెలిపింది. అతని ఎడమ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. శరీరంలో చాలా చోట్ల అతనికి గాయాలయ్యాయి. స్పృహలోనే ఉన్నా.. అతను మరీ బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఉన్న మరో లోకో పైలెట్ డ్రైవర్ జీఎన్ మోహంతి పరిస్థితి కూడా క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్లోని అదే హాస్పిటల్లో అతను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకో పైలెట్, అతని అసిస్టెంట్ కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ పైలెట్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ట్రైన్ ప్రమాదానికి ఆ ఇద్దరే కారణమని వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో వాళ్ల కుటుంబాలు మీడియాను వేడుకుంటున్నారు. తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ ఇలాంటి ప్రమాదాల విషయంలో లోకో పైలెట్లతో ఎటువంటి సంబంధం ఉండదని రైల్వే శాఖ చెబుతోంది. సిగ్నల్ ఆపరేషన్లను అన్నీ సెక్షన్ ఆఫీసర్లు, సెక్షన్ హెడ్స్, స్టేషన్ మాస్టర్ ఆధీనంలో ఉంటాయని ఓ అధికారి తెలిపారు.
సెక్యూర్టీ కారణాల వల్ల ప్రస్తుం లోకో పైలెట్ల చికిత్స గురించి అధికారులు పూర్తి సమాచారాన్ని వెల్లడించడం లేదు. గూడ్స్ రైలుతో పాటు షాలీమార్ ఎక్స్ప్రెస్ రైళ్ల డ్రైవర్లు సురక్షితంగా ఉన్నారు. అదృష్టవశాత్తు గూడ్స్ రైలుకు చెందిన గార్డు మాత్రం ప్రమాద సమయంలో టీ కోసం వెళ్లాడు. గూడ్స్ రైలుకు గార్డు వెనుక ఉంటాడు. ఆ వెనుక నుంచే కోరమండల్ ఢీకొట్టిన విషయం తెలిసిందే.