హైదరాబాద్ : హైదరాబాద్లో బల్క్ డ్రగ్స్ పార్క్ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిందని, అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహంతో హైదరాబాద్లో ఫార్మారంగం వృద్ధి ప్రపంచటంలోనే అత్యుత్తమైన స్థాయికి చేరుకుంటున్నదని ఆయన చెప్పారు. శుక్రవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్స్ పార్క్ స్థాపన విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బల్క్ డ్రగ్స్పార్క్ ఏర్పాటులో కేంద్రం రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని, అయితే చేయూత నివ్వాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు.
కరోనాతో విలవిల్లాడుతుంటే వ్యాక్సిన్ కనుక్కొని ప్రపంచానికి ఉపశమనం కల్పించిన ప్రాంతం హైదరాబాద్ అని ఆయన గుర్తుచేశారు. దేశానికి కావాల్సిన మెడికో ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, స్వదేశీ ఉత్పత్తిని పెంచాలని అందుకోసం బల్క్ డ్రగ్స్ పార్క్ను ఏర్పాటు చేస్తామని కేంద్రం అనేకసార్లు ప్రకటించిన విషయాన్ని ఆయన ఉటంకించారు. తెలంగాణకు అన్ని విషయాల మాదిరిగానే బల్క్ డ్రగ్స్ పార్క్ స్థాపనలోనూ వివక్ష చూపిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకీ తెలంగాణకు ప్రత్యేకించి హైదరాబాద్కు బల్క్ డ్రగ్స్ పార్క్ను కేంద్రం ఏర్పాటు చేసేది ఉందా? లేదా? అని ఆయన నిలదీశారు. దీనిపై కేంద్రం లిఖిత పూర్వక హమీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై కేంద్రమంత్రి మన్షుక్ మాండవీయ స్పందించారు. హైదరాబాద్తో పాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ల్లో బల్క్ డ్రగ్స్ పార్క్ను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం రూ. 1000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనావేశామని కేంద్ర మంత్రి చెప్పారు. తొలి విడుతలో రూ. 300 కోట్లు కేటాయించామని చెప్పారు.