న్యూఢిల్లీ: రాబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ను అడ్డుకోవడానికి సెలక్షన్ ట్రయల్స్ నిబంధనలను మార్చారన్న ఆరోపణలను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఖండించారు. ఆసియా క్రీడల ట్రయల్స్కు అర్హత సాధించాలంటే 2025 సీనియర్ నేషనల్స్, 2026 ఫెడరేషన్ కప్ లేదా అండర్-20 నేషనల్స్లో పతకాలు సాధించాలనే నిబంధనను ఫిబ్రవరిలోనే స్పోర్ట్స్ అథారిటీ, క్రీడా మంత్రిత్వ శాఖకు తెలియజేశామని వివరించారు.
ప్రస్తుతం వినేశ్ పాల్గొనాలనుకుంటున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఫలితాలను ఆసియా క్రీడల ఎంపికకు ప్రాతిపదికగా తీసుకోబోమని డబ్ల్యూఎఫ్ఐ స్పష్టం చేసింది. దీనికి తోడు ఈ నెల 30, 31న జరిగే ఆసియా క్రీడల ట్రయల్స్ విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. వియత్నాంలో జరిగే అండర్-23 ఆసియా చాంపియన్షిప్కు ఎంపికై, మధ్యలో తప్పుకునే రెజ్లర్లను ట్రయల్స్కు అనుమతించబోమని హెచ్చరించింది.