కోల్కతా: పశ్చిమ బెంగాల్ వినియోగదారుల వ్యవహారాల మంత్రి సధన్ పాండే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. గత కొంతకాలంగా ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం కోల్కతాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ప్రస్తుతం వెంటీలేటర్పై ఉన్నారని సధన్ పాండే కుమార్తే వెల్లడించారు.
నిమోనియా వల్ల తన తండ్రి సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని, అయితే ఆయన మెదడు సాధరణంగానే పనిచేస్తున్నట్లు వైద్యులు చెప్పారన్నారు. సీటీ స్కాన్లో నిమోనియా ఉన్నట్లు తేలిందన్నారు.
70 ఏండ్ల సధన్ పాండే మానిక్టాలా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరుసగా మూడుసార్లు ఆ నియోజక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఏడాది సీఎం మమత మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధతలు చేపట్టారు.