కోల్కతా : టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో తన సన్నిహితురాలి వద్ద పెద్దమొత్తంలో నగదు పట్టుబడటంతో ఈ కేసులో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్ధ ఛటర్జీ సోమవారం వరకూ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఆపై మంత్రి పార్ధ ఛటర్జీని మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కోర్టులో ప్రవేశపెడతారు.
మంత్రికి సంబంధించిన 14 ప్రదేశాల్లో సోదాలు చేపట్టామని, ఆయన సన్నిహితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ న్యాయవాది తెలిపారు. మరోవైపు తన క్లైంట్ నివాసం నుంచి ఎలాంటి సొమ్ము స్వాధీనం చేసుకోలేదని ఛటర్జీ న్యాయవాది చెబుతున్నారు. ఇక తనకు ఛాతీలో నొప్పి వస్తోందని వైద్య సాయం కావాలని మంత్రి అధికారులను కోరారు. ఇక పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
ఈ కుంభకోణంలో మంత్రి పార్ధా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని నిర్బంధించారు. ఇదే కేసులో కజి నజ్రుల్ యూనివర్సిటీకి చెందిన బంగ్లా ప్రొఫెసర్, మంత్రి మరో సన్నిహితురాలు మొనాలిసా దాస్ పాత్రపైనా ఈడీ ఆరా తీస్తోందని సమాచారం. మొనాలిసా పేరున 10 ఫ్లాట్లు ఉన్నాయని, ఆమె కూడా ఈడీ నిఘా నేత్రంలో ఉన్నదని బీజేపీ నేత దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.