Bengal | టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తోసిపుచ్చారు. రాజ్ భవన్లో ఆయుధాలు ఇస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని.. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. సొంత రాష్ట్ర పోలీసులను నమ్మడం లేదా? దీని వెనుక అంతర్గత రాజకీయాలు ఉన్నాయా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాజ్భవన్లో ఆయుధాలు కోసం వెతకడం అంటే అంధుడు చీకటి గదిలో నల్లపిల్లి కోసం వెతుకుతున్నట్లుగా ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. రాజ్భవన్ ప్రజల కోసం తెరిచే ఉందని.. ఉదయం 5గంటల నుంచి సామాన్య ప్రజలు, పౌర సమాజం సభ్యులు, మీడియా రాజ్భవన్కు వచ్చి ఆయుధాలు ఉన్నాయో లేవో చూసుకోవచ్చన్నారు.
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారం మాట్లాడుతూ బీజేపీ నేరస్తులను రాజ్భవన్కు పిలిచి టీఎంసీ కార్యకర్తలపై దాడి చేసేందుకు వారికి ఆయుధాలు ఇస్తున్నారని ఆరోపించారు. బెంగాల్ గవర్నర్తో బీజేపీ నేరస్తులను రాజ్భవన్కు ఆహ్వానించడం ఆపమని చెప్పండి.. ఆయన వారిని అక్కడే ఉంచి టీఎంసీ కార్యకర్తలపై దాడి చేయడానికి ఆయుధాలు ఇస్తున్నారు.. ఈ గవర్నర్ రాజ్భవన్లో ఉన్నంత వరకు బెంగాల్కు ఏమీ మంచి జరుగదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. టీఎంసీ ఎంపీ ఆరోపణలను కొట్టిపడేశారు. టీఎంసీ ఎంపీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గవర్నర్ బోస్ హెచ్చరించారు.